Friday 2 July 2021

Sri Mukha Lingam Temple information in Telugu - వేయి సంవత్సరాల అతి పురాతన శివాలయం శ్రీముఖలింగం

శ్రీకాకుళం సమీపంలో ఉన్న వేయి సంవత్సరాల పైగా చరిత్ర కలిగిన అత్యంత పురాతన దేవాలయం:
 
వారాహి సమేత శ్రీముఖలింగేశ్వరస్వామి వారి ఆలయం, శ్రీముఖలింగం, శ్రీకాకుళం జిల్లా


గత చరిత్రలో ఈ నగరం పేరు కళింగనగరం... ఖారవేలుని కళింగ రాజ్యానికి రాజధాని....సుమారు c.era  ఏడవ శతాబ్దం వరకు కళింగసీమ పాలకులకు ఇదే రాజధాని. కానీ ప్రస్తుతం కేవలం ఒక పుణ్య క్షేత్రంమిగిలి పోయింది. ఉత్తరాంధ్రలో ఈ ఆలయం ఒక ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం, అతి పురాతన దేవాలయం దాదాపు 1000 సంవత్సరాలకు పైగా చరిత్ర ఉంది ఈ ఆలయానికి.. శ్రీముఖలింగం నిర్మాణంలోను, చెక్కడాలలోను, శిల్ప సౌందర్యంలోను అడుగడుగునా ఉత్కళ సంప్రదాయం కనపడుతుంది. చాలా అరుదుగా కనిపించే యమ, ఇంద్రాది దిక్పాలకుల ఆలయాలు కూడా ఇక్కడ మనం చూడవచ్చు. ఇక్కడ స్వామి ముఖలింగేశ్వరుడు, మధుకేశ్వరునిగా, జయంతేశ్వరునిగా భక్తుల ఆరాధనలందుకుంటున్నాడు.



గ్రహాలలో అత్యంత శక్తివంతుడుగా ఎటువంటి వారినైనా భయపెట్టగలవానిగా చెప్తారు శనిదేవుడిని. అలాంటి శనిదేవుడు ఒక సందర్భంలో సాక్షాత్తు ఆ పరమేశ్వరునితోనే సవాలు చేసాడట. ‘నిన్ను తప్పకుండా పట్టుకుంటాన‘ని. ఆ శక్తి నీకు లేదన్నాడట శివుడు. ఈ విషయంమీద ఇద్దరికీ వాదన పెరిగింది. ‘‘సరే! ఎలా పట్టుకుంటావో చూస్తానంటూ చెట్టుతొర్రలో చేరిపోయాడట భోళాశంకరుడు. ఆ తరువాత నన్ను ఎలాగైనా పట్టుకుంటానన్న నీ శక్తి ఏమైందన్నాడు శివుడు శనీశ్వరునితో. దానికి శనిదేవుడు ఎంతమాత్రం బెదరకుండా నిదానంగా నవ్వుతూ ‘‘నా ప్రభావం కారణంగా కాకపోతే పరమేశ్వరుడవయిన నీవు ఒక చెట్టు తొర్రలో వుండవలసిన ఖర్మ ఏమిటి!? ఇదంతా నా ప్రభావం వల్లనే కదా!’ అన్నాడట శనిదేవుడు. అలా పరమేశ్వరుని ముఖంతో ఏర్పడ్డ ఆ చెట్టు తొర్రే నేటి ముఖ లింగేశ్వరుడు అన్నది ఒక పురాణ కథనం.


(ఈ చిత్రాలు 360 అంటే మన చుట్టూ ఉన్నట్లు చూడవచ్చు.. మొబైల్ త్రిప్పుతూ.. మరియు.. జూమ్ కూడా చేయవచ్చు.. అక్కడి శిలా సంపద.. అద్భుతాలు మీరు చూడవచ్చు)



మరొక కథనం ప్రకారం నామదేవుడు చేసిన యజ్ఞానికి దేవతలందరూ తరలి వస్తారు. ఆ సందర్భంలో జరిగిన నాట్య ప్రదర్శనలో మోహావేశపరవశుడైన చిత్రసేనుడనే గంధర్వుడు సభా మర్యాదను త్రోసిరాజని, ఉచితానుచితాలు మరిచిపోయి ఆ స్ర్తిలతో నాట్యంలో మునిగిపోయాడట. అతడియొక్క అనుచితమైన ప్రవర్తనకు ఆగ్రహించిన పరమేశ్వరుడు, ఉన్నతమైన సంస్కారంతో మెలగవలసిన గంధర్వుడవయిన నీవు సంస్కారంలేని ఒక కిరాతుడిలా అవివేకిలా ప్రవర్తించిన కారణంగా కిరాతుల ఇళ్లలో పుట్టమని శపించాడట. దాంతో తానున్న స్థితినుంచి బయటపడి తన తప్పును తెలుసుకున్న గంధర్వుడు కరుణించమని శివునిముందు మోకరిల్లాడు. ఇతని వేడుకోళ్లకు కరిగిపోయిన ఆ భోళాశంకరుడు, విప్పచెట్టునుంచి మధుకేశ్వరునిగా ఉద్భవించే తనను చూడగానే శాపవిమోచనం కలుగుతుందని కరుణించాడట. శాపప్రభావంతో గంధర్వుడు కిరాతుడిగా పుట్టాడు. కిరాత కన్యను, జంగమ స్ర్తిని వివాహమాడి జీవనం కొనసాగిస్తున్నాడు. తన జన్మ సంస్కారం వలన భగవద్భక్తితో మనుగడ సాగిస్తోంది జంగమస్ర్తి. విప్పచెట్టుని భగవంతుడిగా భావించి ప్రతినిత్యం ఆ విప్పచెట్టుకి పూజలు చేస్తూ సాక్షాత్తు పరమేశ్వరునిగా ఆరాధిస్తోంది జంగమస్ర్తి, సహజంగానే ఆమె సంస్కారానికి, మంచి తనానికి ముగ్ధుడై ఈమెవైపు ఆకర్షితుడయ్యాడు కిరాతునిగా వున్న గంధర్వుడు. దాంతో అసూయతో రగిలిపోయింది కిరాతుని మరో భార్య అయిన కిరాత స్ర్తి.

ఏదో ఒక విధంగా ఆమెను బాధించి తన కసి తీర్చుకోవాలనుకుంది. అందుకామెకు ఒకే ఒక్క మార్గం కనపడింది. తన సవతి నిత్యం భక్తిశ్రద్ధలతో పూజించే విప్పచెట్టుని లేకుండా చేస్తే ఆమెకు సరైన గుణపాఠం అనుకున్న ఆ కిరాతురాలు ముందు వెనకలు ఆలోచించకుండా ఆ విప్పచెట్టును నరికేసింది. ఆసమయంలో ఆ చెట్టుతొర్రలోనుండి మధుకేశ్వరునిగా ఆవిర్భవించాడు పరమేశ్వరుడు. ఆ దృశ్యాన్ని చూసిన కిరాతునికి శాప విమోచనం కలిగి తన గంధర్వలోకానికి చేరుకున్నాడు.

ఆ చెట్టుతొర్రె నేడు ప్రధాన ఆలయంలో ఆరాధించబడుతున్న మూలవిరాట్టు అని స్థలపురాణం చెప్తోంది. మూలవిరాట్టుకి కాస్త వెనకగా ఒక పెద్ద మట్టిగోలెం చూడవచ్చు. ఆ భోళాశంకరుడు భక్తులను ఎంత త్వరితంగా కరుణిస్తాడో..వరాలను కురిపిస్తాడో...ఒక్కోసారి అంతగాను పరీక్షలకు గురి చేస్తాడనీ...అయితే చివరకు భగవద్భక్తే గెలుస్తుందని భక్తుల ఆర్తికి ఆ పరమేశ్వరుడు దిగిరాక తప్పదన్న వాస్తవానికి నిదర్శనమే ఈ గోలెం.


 

 నాగన్న అనే కుమ్మరి గొప్ప శివభక్తుడు. నాగన్నకు వున్న లోటంతా ఒక్కటే. సంతానం లేకపోవడం. ఆ సంతానం కోసం పరమేశ్వరుడుని పరిపరి విధాల వేడుకున్నాడు. తనకు సంతానాన్ని ప్రసాదిస్తే తన శక్తికొద్దీ రెండు గోలేలను సమర్పించుకుంటానని మొక్కుకున్నాడు. భగవత్కృపతో సంతానాన్ని పొందిన నాగన్న తన మొక్కు ప్రకారం గోలేలను చేసి శ్రీ ముఖలింగ్వేరునికి సమర్పించడం కోసం తీసుకువచ్చాడు. కాని ద్వారానికంటే వెడల్పుగా వుండడంవల్ల వాటిని లోనికి తీసుకుపోవడం కుదరలేదు. సరేనని మళ్లీ కొత్త గోలేలను తయారుచేసాడు. కానీ మళ్లీ మొదటి పరిస్థితే. ఇలా ఎన్నిసార్లు ప్రయత్నించినా ఫలితం శూన్యమే. మొక్కు తీర్చడం కోసం తను చేసిన ప్రయత్నాలన్నీ విఫలమవడంతో ఇదంతా తన భక్తిలో లోపమేనని, ఆ కారణంగానే తన మొక్కును పరమేశ్వరుడు స్వీకరించడంలేదని భావించిన నాగన్న తన ప్రాణాలనే వదలడానికి సిద్ధపడ్డాడు. చివరిగా ఒక్కసారి ప్రయత్నించి చూద్దామనుకున్నాడు.

విచిత్రం ఏమంటే అతడలా అనుకోగానే అంతకుముందు పెద్దవై లోనికి తీసుకుపోవడానికి సాధ్యం కాని ఆ గోలేలు చాలా చక్కగా లోపలకు తీసుకువెళ్లగలిగాడట. ఇదంతా పరమేశ్వరుని కరుణకు, నాగన్న భక్తికి నిదర్శనంగా చెప్తారు. ఆ జ్ఞాపకంగానే ఆ కథనానికి చిహ్నంగానే ఆ గోలేలను మూలవిరాట్టుకు వెనకగా వుంచినట్టు ఒక కథనం. అతి ప్రాచీన పుణ్యక్షేత్రంగా ఒకప్పటి వైభవానికి చిహ్నంగా వున్న శ్రీ ముఖలింగం శ్రీకాకుళం జిల్లాలో వుంది.శ్రీకాకుళంనుంచి శ్రీముఖలింగం బస్సులో చేరుకోవచ్చు.
శిల్ప సంపద.. ఆలయ నిర్మాణ కౌశల్యం చాలా బావుంటుంది.. ఒక రోజు పూర్తిగా కావాలి ఈ ఆలయం చూడడానికి...








అరసవిల్లి.. శ్రీ కూర్మం.... యాత్రలు వెళ్ళే వారు.. ఈ ఆలయాన్ని చూడడానికి ప్లాన్ చేసుకోవచ్చు.. అరసవిల్లి నుండి దాదాపు 50 కి.మీ. లోపు ఉంటుంది.. తప్పని సరిగా చూడవలసిన ఆలయం ఇది





  


Tags:
Sri Mukha Lingam Temple information in Telugu -
 వేయి సంవత్సరాల అతి పురాతన శివాలయం శ్రీముఖలింగం, 
ancient temples in AP, 
temples near Arasavelli,
Temples near Sri Kurmam.

Post a Comment

Whatsapp Button works on Mobile Device only